ధరల పెంపుబాటలో హోండా, రెనో, టాటా మోటార్స్

  • అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరల పెంపు
  • అధికమైన రవాణ చార్జీలు
  • పెరిగిపోతున్న ఉత్పాదక వ్యయం
  • ఇప్పటికే నిర్ణయం తీసుకున్న మారుతి, ఆడి, బెంజ్
ఓవైపు కరోనా సంక్షోభం, మరోవైపు అంతర్జాతీయంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు కూడా ధరలు పెంచుతున్నాయి. వాహనాలు, విడిభాగాల తయారీకి ఉపయోగించే ఉక్కు, రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ ధరలు పెరగడం, రవాణా చార్జీలు భగ్గుమంటుండడం వల్ల పలు సంస్థలు ధరల పెంపు బాటపడుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి, మెర్సిడెస్ బెంజ్, ఆడి సంస్థలు జనవరి నుంచి ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.

తాజాగా హోండా, టాటా మోటార్స్, రెనో కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నాయి. ధరలు పెంచేందుకు ఈ మూడు దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఉత్పాదక వ్యయంలో కొద్దిమేర అయినా సర్దుబాటు చేసుకునేందుకు ధరలు పెంచడం తప్పనిసరి అని ఆయా కంపెనీల అభిప్రాయం.

భారత్ లో సిటీ, అమేజ్ వంటి మోడళ్లతో గణనీయంగా అమ్మకాలు సాగిస్తున్న హోండా ఇప్పటికే గత ఆగస్టులో ఓసారి ధరలు పెంచింది. క్విడ్, కైగర్, ట్రైబర్ వంటి మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఫ్రెంచ్ కంపెనీ రెనో భారత్ లో వచ్చే ఏడాది ఆరంభం నుంచి కొత్త ధరల శ్రేణిని ప్రకటించనుంది.

Honda
Renault
Tata Motors
Price Hike
India

More Telugu News